ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక హక్కుల కోసం గళమెత్తిన ఏఐసిసిటియు
ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని చిత్తపూరు, మర్రిబందం, చీపురుగూడెం గ్రామాలలో ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఐసిసిటియు (AICCTU), అఖిలభారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం (ఐయార్లా) ఆధ్వర్యంలో జెండాలు ఎగరవేసి కార్మికులకు ఐక్యత సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లా రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ అనుకూల నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కోడ్లను తక్షణమే రద్దు చేసి పాత కార్మిక చట్టాలను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వి.బి గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, ప్రతి కుటుంబానికి జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఉపాధి హామీ కింద 200 రోజుల పని, రోజుకు కనీసం ₹600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
కార్మికులు, ప్రజలు తమ హక్కులు సాధించుకోవాలంటే ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాట్ల బాబూరావు, వేముల బక్కయ్య, హెచ్చు రాజేంద్రప్రసాద్, తగరం తిరపతిరావు, రేగుల రాముడు, అబ్బదాసరి సుందరం, భవాని, బి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.