ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా చాట్రాయి లో అవగాహన కార్యక్రమం
చాట్రాయి, ఆగస్టు 5: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. గాయత్రీదేవి ఆధ్వర్యంలో జరిగింది. తల్లిపాలు శిశువుల శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో కీలకమని, పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అవసరమని ఆమె వివరించారు. మొదటి ఆరు నెలల వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
ఈకార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలు, ప్రాంతానికి చెందిన మహిళలు పాల్గొన్నారు.