జానపద ఆరాధనపై ద్రావిడ విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు ప్రారంభం
ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురణల శాఖ మరియు దక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ, తిరువనంతపురం, కేరళ (FOZILS) సంయుక్త ఆధ్వర్యం
ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రచురణల శాఖ మరియు దక్షిణాత్య జానపద విజ్ఞాన సంస్థ, తిరువనంతపురం, కేరళ (FOZILS) సంయుక్త ఆధ్వర్యంలో “తెలుగు ప్రాంతాల్లో జానపద ఆరాధన, మౌఖిక సంప్రదాయాలు మరియు దేశీ జ్ఞాన వ్యవస్థల అంతర్ సంబంధాలు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం యూనివర్సిటీ ఏమేనో భవనంలో ప్రారంభమైంది.
ఈ ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్. సి. మల్లయ్య మాట్లాడుతూ, ద్రావిడ రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న వివిధ ఆచారాలు, కళా సంస్కృతులను సేకరించి, వాటిని డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం ద్వారా విశ్వవిద్యాలయానికి మంచి గుర్తింపు తీసుకురావచ్చని తెలిపారు.
సదస్సు సభాధ్యక్షులు ఆచార్య డి. వి. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, జానపదం మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని, వాటిని పరిరక్షించడం మరియు సేకరించి పుస్తకరూపంలో నిక్షిప్తం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు.
ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వ్యవస్థాపక సంచాలకులు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి కీలకోపన్యాసం చేస్తూ, తాను రచించిన “గంగ జాతర” పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, గంగ జాతరలో విందుకు అట్లు ఆడే సంప్రదాయాన్ని ఉదాహరణలతో వివరించారు. జానపదులు గ్రామదేవతలను ఎందుకు ఆరాధించారో, జంతు బలులు ఎలా ప్రారంభమయ్యాయో, కరవు కాలంలో ప్రకృతి ఆరాధన ఎలా ఉద్భవించిందో వివరించారు. హరప్పా, మొహంజోదారో సింధు నాగరికతలో లభించిన ముద్రల ఆధారంగా ఈ విషయాలు నిరూపితమయ్యాయని తెలిపారు.
మన రోజువారీ జీవితంలో ఉపయోగించే కథలు, గేయాలు, పొడుపుకథలు, వీరగాథల ద్వారా మన పూర్వీకులు అపారమైన జ్ఞాన సంపదను అందించారని, దానిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. శక్తి ఆరాధన ప్రారంభం ఎలా జరిగిందో, గ్రామాల పేర్లు ఎలా ఏర్పడ్డాయో కూడా వివరించారు.
ఆత్మీయ అతిథి ఆచార్య బి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, FOZILS సంస్థ ఎలా ఆవిర్భవించిందో, ఎందుకు స్థాపించబడిందో వివరించారు. జానపద అధ్యయనాల కోసం అనుసరించాల్సిన పరిశోధనా పద్ధతుల గురించి వివరంగా తెలియజేశారు. ఫాసిల్స్లా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. మన ప్రాంతీయ ఆచారాల్లో దాగి ఉన్న శాస్త్రీయ ఆలోచనలను తదుపరి తరాలకు అందించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. తరువాత పత్ర సమర్పకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో డీన్ అకాడమిక్ అఫైర్స్ ఆచార్య కె. శ్యామల గారు, సదస్సు సంచాలకులు డాక్టర్ జి. శైలమ్మ, డాక్టర్ ఎస్. హేమలత , బోధన మరియు బోధనేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
డా. పి. ఎస్. గణేష్ మూర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం – 517426