పవిత్ర సంగమం విజయవంతం.. కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు
ఇబ్రహీంపట్నం, జూలై 15: పవిత్ర కృష్ణా–గోదావరి సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మైలవరం నియోజకవర్గం నలుమూలల నుంచి కూటమి కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకులు, మండల, గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని, కృష్ణా–గోదావరి నదుల అనుసంధానానికి చారిత్రక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న దూరదృష్టికి ప్రజల నుంచి లభించిన విశేష స్పందనకు ఈ కార్యక్రమమే నిదర్శనమని పేర్కొన్నారు.
ఇదే ఉత్సాహం, ఐక్యత, అంకితభావంతో ప్రజాసేవలో ముందుకు సాగుతూ మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.