ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు ఇళ్లపై ఏసీబీ దాడులు
తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఏఎస్పీ భుజంగరావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి దృష్టి సారించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు.
హైదరాబాద్లోని హఫీజ్పేటలో ఉన్న భుజంగరావు నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇతర ఆస్తుల వద్ద కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు నిర్వహించడం రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సోదాలు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.