రాళ్లవాగు సాక్షిగా ప్రజాధనం దోపిడీ.. ఎమ్మెల్యే ‘ఇంటి’ కోసమే ఆరు వరుసల బ్రిడ్జ్ రోడ్డు: నడిపెల్లి దివాకర్ రావు
రాళ్లవాగుపై నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిర్మిస్తున్న ఆరు వరుసల (6 లైన్ల) వంతెన రోడ్డు కేవలం ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటి ప్రయోజనం కోసమేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. శుక్రవారం ఆయన తన పార్టీ శ్రేణులతో కలిసి రాళ్లవాగు వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో శ్రీనివాస్ గార్డెన్ ప్రాంతం నుండి రూ. 35 కోట్లతో మంజూరైన నాలుగు వరుసల రోడ్డు పనులను కుదించి, అస్సలు అవసరం లేని చోట ఈ ఆరు వరుసల వంతెనగా మార్చడం వెనుక కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందన్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నడూ అడ్డు కాదని, కానీ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించే విధంగా సాగుతున్న ఈ వంతెన నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఎమ్మెల్యే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ అనవసరపు విస్తరణ మరియు మార్పుల వల్ల స్థానిక ప్రజలు తమ ఇళ్లు, విలువైన భూములు, కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను కోల్పోతూ కన్నీరు పెడుతున్నారని దివాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత నిర్మాణంలో తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్నాయని, తక్షణమే ఈ పనులను నిలిపివేసి పాత పద్ధతిలోనే ఎత్తు పెంచి బ్రిడ్జ్ డౌన్ పనులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవి వచ్చింది కదా అని అహంకారంతో, "తాము చెప్పిందే వేదం" అన్న చందంగా వ్యవహరిస్తూ ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ బాధితుల కన్నీళ్లకు కారణమవుతున్న ప్రస్తుత పాలకులకు వచ్చే 2028 ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు