రామన్నపేట ఆస్పత్రి ఘోరం : నిధులున్నా రోగులకు తప్పని నరకయాతన!
స్పందించని సూపరింటెండెంట్
* రూ.40 లక్షల నిధులున్నా తప్పని అవస్థలు
ప్రభుత్వాలు మారుతున్నా, బడ్జెట్లు కేటాయిస్తున్నా ఆస్పత్రుల్లో రోగుల తలరాతలు మాత్రం మారడం లేదు. నిధులు మూలుగుతున్నా.. రోగులకు అవస్థలు తప్పడం లేదు. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులే ఇందుకు సజీవ సాక్ష్యం.
* ఉక్కపోతతో నరకయాతన.. గర్భిణీలు, చిన్నారుల విలవిల
ప్రస్తుత ఎండల కాలంలో ఆస్పత్రిలోని వార్డులు నరకకూపాలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల వార్డుల్లో కనీసం ఒక్క కూలర్ కూడా లేకపోవడంతో, డెలివరీ కోసం వచ్చిన గర్భిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు, చిన్నపిల్లల వార్డులో ఉన్న ఏసీలు కేవలం అలంకారప్రాయంగానే మారాయి. అవి పనిచేయకపోవడంతో పసిపిల్లలు ఉక్కపోతకు విలవిలలాడుతుంటే, వారిని కాపాడుకోలేక తల్లిదండ్రులు చేతులతో విసురుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.
* దెబ్బతిన్న స్విచ్బోర్డులు
ప్రమాదకరంగా వేలాడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
రూ. 40 లక్షల ఆదాయం ఏమైనట్లు..?
రామన్నపేట ఏరియా ఆస్పత్రికి నిధుల కొరత ఉందనుకుంటే పొరపాటే. ఈ ఏడాది ఏప్రిల్ 16 నాటికి ఆస్పత్రికి చెందిన మడిగల (షాపుల) కిరాయిల రూపంలోనే ఏకంగా రూ. 40 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ఇంత భారీ మొత్తంలో బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చిన్న చిన్న మరమ్మతులు చేపట్టడానికి, కూలర్లు కొనుగోలు చేయడానికి అధికారుల చేతులు ఎందుకు రావడం లేదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.