రేషన్ మాఫియా డాన్ గొట్టపు రమేష్ అరెస్ట్
పిడిఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న రౌడీషీటర్పై పీడీ యాక్ట్తో చెక్ పెట్టిన కృష్ణా జిల్లా పోలీసులు
కృష్ణా జిల్లా, మార్చి 26: పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా పక్కదారి పట్టిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్న రేషన్ మాఫియాపై కృష్ణా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రౌడీషీటర్ గొట్టపు రమేష్ను అరెస్ట్ చేసి ప్రివెంటివ్ డిటెన్షన్ (PD) యాక్ట్ కింద నిర్బంధించారు.
పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని పామర్రు గ్రామానికి చెందిన గొట్టపు రమేష్ (తండ్రి: రామకృష్ణ) పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో గన్నవరం యుపిఎస్, గుడివాడ వన్ టౌన్, పామర్రు, పడమట, గుడివాడ టూ టౌన్, ఆలుమూరు (కోనసీమ జిల్లా), కంకిపాడు, గుడివాడ రూరల్, పెనమలూరు, పాలకొల్లు (పశ్చిమగోదావరి), నర్సాపురం రూరల్, ఎలమంచిలి, రావులపాలెం, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై మొత్తం 21 కేసులు నమోదయ్యాయి.
2026లో రౌడీ షీట్ తెరవడం
ఇతని నేరచరిత్ర దృష్ట్యా 2026 సంవత్సరంలో పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో, ప్రజాభద్రతకు ముప్పుగా మారినట్లు అధికారులు నిర్ధారించారు.
జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం గొట్టపు రమేష్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి నిర్బంధించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి అక్రమాలకు పాల్పడినా లేదా సహకరించినా చట్టప్రకారం తీవ్ర పరిణామాలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.