రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రచార జాతా ప్రారంభం
ఏలూరు, జూన్ 29: రైతు ఉద్యమ నిర్మాతలు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, ఉద్దరాజు రామం స్ఫూర్తితో రైతు ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకుడు వై. కేశవరావు పిలుపునిచ్చారు.
జులై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఏలూరులో ప్రచార జాతా ప్రారంభమైంది. పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వై. కేశవరావు జెండా ఊపి జాతాను ప్రారంభించారు. అంతకుముందు పవర్పేటలోని ఉద్దరాజు రామం భవనం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వై. కేశవరావు మాట్లాడుతూ, 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడిందని, అనంతరం 1954లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏర్పడి రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందని గుర్తు చేశారు. 1936-37లో కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, చలసాని వాసుదేవరావు నాయకత్వంలో జరిగిన రైతు రక్షణ యాత్ర అనేక సమస్యల పరిష్కారానికి దోహదపడిందన్నారు.
ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసే విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల పాడి, పౌల్ట్రీ పరిశ్రమలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
జులై 3న నిర్వహించే "హలో రైతన్న - చలో ఏలూరు" కార్యక్రమానికి అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. బలరాం మాట్లాడుతూ, వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. రాజా రామ్మోహన్ రాయ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం. నాగమణి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పి. మంగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సూర్యకిరణ్, సిఐటియు నగర నాయకులు పంపన రవికుమార్, ఎం. ఇస్సాకు తదితరులు పాల్గొన్నారు.