గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు
గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు
గుడిపాల మండలం పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో నారగల్లు పంచాయతీ సీఎం కండ్రిగ, మునీశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న తాటికుంట చెరువు వద్ద చోటుచేసుకుంది.
ఎన్ఆర్ పేట, జీడినెల్లూరు ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి, గత 20 రోజులుగా తాటికుంట చెరువు వద్ద అక్రమంగా డంప్ చేసి, అక్కడి నుంచి టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది.
దీంతో అధికారులు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఆ సమయంలో ఇసుకను లోడ్ చేసుకుని తమిళనాడుకు వెళ్తున్న రెండు టిప్పర్లను ఆపి, ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో గత 20 రోజులుగా తమిళనాడులోని రాణిపేట, వేలూరు, బాలాజీ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. నారగల్లుకు చెందిన ఉమాపతి అలియాస్ విక్కీ ఇసుకను తాటికుంట చెరువు వద్ద అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు వారు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి టిప్పర్ డ్రైవర్లు అజిత్ కుమార్, అంబారసుతో పాటు ఇసుకను అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమాపతి అలియాస్ విక్కీపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.