రూ. 30 వేల అప్పు కోసం దారుణ హత్య : కేశరాజుపల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు
నల్లగొండ లోని కేశరాజుపల్లి శివారులో ఇటీవల సంచలనం సృష్టించిన బోథ్ సాయి కుమార్ దారుణ హత్య కేసును జిల్లా పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించారు. అప్పు ఇవ్వలేదనే కక్షతోనే సాయి కుమార్ను నిందితులు అతి కిరాతకంగా సిమెంటు రాయితో తలపై కొట్టి, ముఖం చిత్తుచిత్తు చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ అడిషనల్ ఎస్పీ జి. రమేష్ శనివారం మీడియాకు వెల్లడించారు . పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం రూ. 30 వేల అప్పు విషయంలో మృతుడు సాయి కుమార్కు, నిందితులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ముందస్తు పథకం ప్రకారం నిందితులైన ఫూర్ఖాన్ అలియాస్ మహేష్, ఆరిఫ్ అనే చీరల వ్యాపారులు సాయి కుమార్ను మద్యం పార్టీ పేరుతో కేశరాజుపల్లి శివారులోని ఒక నిర్మానుష్య వెంచర్కు పిలిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించిన అనంతరం, నిందితులు సాయి కుమార్పై సిమెంటు రాయితో తలపై దారుణంగా దాడి చేసి హతమార్చారు. హత్య అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను నిందితులు దొంగిలించారు. వాటిని విక్రయించేందుకు విజయవాడకు పారిపోయారు. నిందితులు ఫూర్ఖాన్ @ మహేష్ (37), ఆరిఫ్ (26) ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చీరల వ్యాపారులు కాగా, ప్రస్తుతం నల్గొండ టౌన్ బొట్టుగూడెం, మేథర్ కాలనీ (నటరాజ్ టాకీస్ రోడ్) లో నివసిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టిన పోలీసులు విజయవాడలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు తాయెత్తు, బంగారు ముక్కుపుడక, బంగారు చెవి కమ్మ మరియు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ కేసు ఛేదన కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఏఎస్ఐ అఫ్జల్ మరియు పోలీసు సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి నాలుగు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన ప్రత్యేక బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.