రూ.45 లక్షల బంగారం దొరికినా ఆశపడలేదు.. తిరుపతి హోటల్ క్యాషియర్ నిజాయతీకి సెల్యూట్!
తిరుపతిలో అరుదైన నిజాయతీకి నిదర్శనంగా నిలిచిన ఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. బెంగళూరుకు చెందిన భరత్కుమార్ కుటుంబం తిరుమల దర్శనం, వివాహ కార్యక్రమం ముగించుకుని వెళ్తూ జూపార్కు రోడ్డులోని గరుడాద్రి హోటల్లో భోజనం చేసింది. అయితే తొందరలో ఏకంగా 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న హ్యాండ్బ్యాగ్ అక్కడే మర్చిపోయింది.
బెంగళూరు చేరుకున్న తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితులు వెంటనే డయల్ 112కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హోటల్కు చేరుకోగా, అక్కడి క్యాషియర్ శశి తన వద్ద భద్రంగా ఉంచిన బ్యాగ్ను ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా పోలీసులకు అప్పగించారు
ఆ బ్యాగ్లో సుమారు రూ.45 లక్షల విలువైన పెళ్లి నగలు ఉండటంతో బాధిత కుటుంబం ఊపిరి పీల్చుకుంది. "నగలు దొరకకపోయి ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం" అంటూ క్యాషియర్ శశికి భరత్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అసాధారణ నిజాయతీని గుర్తించిన పోలీసులు శశిని జిల్లా పోలీసు కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ, "నిజాయతీ అనేది మనిషి సంపాదించే అత్యంత విలువైన ఆస్తి" అని కొనియాడారు.
ప్రలోభాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన క్యాషియర్ శశి... సమాజానికి ఆదర్శంగా నిలిచారు