www.ntodaynews.com
శ్రీశైలంలో టెలికాం సేవలపై సమీక్ష సమావేశం
తెలంగాణ
శ్రీశైలంలో టెలికాం సేవలపై సమీక్ష సమావేశం
NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో కమ్యూనికేషన్ సేవలు అంతరాయం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి టెలికాం సంస్థల ప్రతినిధులకు ఆదేశించారు.
గురువారం శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి బీఎస్ఎన్ఎల్ అధికారులు, వివిధ సెల్ టవర్ సంస్థల ప్రతినిధులు, ఫైబర్ నెట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో సుమారు మూడు లక్షల మంది భక్తులు శ్రీశైలానికి రానున్న నేపథ్యంలో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఎటువంటి సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రత్యేకంగా రద్దీ ప్రాంతాలు, క్యూలైన్లు, దేవస్థానం పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ ప్రదేశాలు, నడకదారి మార్గాలలో సిగ్నల్ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. అవసరమైన చోట తాత్కాలిక మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడం, ప్రస్తుత టవర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఫైబర్ నెట్ కనెక్షన్లను సమర్థవంతంగా నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కాల్ డ్రాప్స్, నెట్వర్క్ జామ్ సమస్యలు లేకుండా 24 గంటల మానిటరింగ్ వ్యవస్థ అమలు చేయాలని సూచించారు.
ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని టెలికాం సంస్థల ప్రతినిధులకు తెలిపారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సేవలు, పోలీస్ కంట్రోల్ రూమ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యల సమన్వయం కోసం నిరంతర కమ్యూనికేషన్ కీలకమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేయాలని సూచించారు.
సమావేశంలో దేవస్థానం అధికారులు, టెలికాం విభాగ సిబ్బంది, ఫైబర్ నెట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
#Srisailam #Mahashivaratri #TelecomServices #NandyalDistrict #TempleManagement #DevoteeSafety #NetworkConnectivity #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube