సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో మరో ముగ్గురిపై సిట్ దృష్టి
రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. మాజీ సీఐ నాగరాజుకు సహకరించిన మరో ముగ్గురు పోలీసు సిబ్బంది పాత్రపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసులో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
సిట్ దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, ఫోన్ కాల్ వివరాల ఆధారంగా కీలక ఆధారాలను సేకరించిన అధికారులు, సాయికృష్ణ మే 6 నుంచి 8 మధ్య కస్టడీలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఇప్పటికీ సాయికృష్ణ మృతదేహం లభ్యం కాకపోవడంతో గాలింపు కొనసాగుతోంది.
కేసు వివరాల ప్రకారం.. సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ అక్రమ నిర్బంధంలో ఉంచి తీవ్రంగా హింసించడంతో అతడు కస్టడీలోనే మృతి చెందినట్లు సిట్ తన రిమాండ్ నివేదికలో పేర్కొంది. అనంతరం సాక్ష్యాలను చెరిపివేసే ఉద్దేశంతో మృతదేహాన్ని మాయం చేసినట్లు అనుమానిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డింగ్ పరికరాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, సంబంధిత కాలానికి చెందిన ఎలాంటి దృశ్యాలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మాజీ సీఐ నాగరాజు అరెస్టు అనంతరం హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, అలాగే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు మే 29న వడ్డేశ్వరంలో సాయికృష్ణ బంధువులను కలిసినట్లు ఫోన్ కాల్ వివరాలు, సీసీటీవీ దృశ్యాల ద్వారా సిట్ నిర్ధారించింది.
సాయికృష్ణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి న్యాయం చేయాలని కోరడంతో ప్రభుత్వం ఐజీపీ రవిప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జులై 6కు వాయిదా వేసింది. సిట్ నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.