www.ntodaynews.com
సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ప్రజల భద్రతే లక్ష్యంగా.. పోలీసుల విస్తృత అవగాహన..
ప్రజల భద్రత, నేరాల నియంత్రణే ధ్యేయంగా అన్నమయ్య జిల్లా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు, గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివిధ చట్టాలు, నిబంధనలపై అవగాహన కల్పించారు. ఒకవైపు స్నేహపూర్వక వాతావరణంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోవైపు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో జరిగే ఆన్లైన్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామస్థులతో మమేకమై వివరించారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా భద్రతా చట్టాలు, పోక్సో చట్టం తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.
రహదారి భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రాణనష్టాన్ని వివరించారు. యువత పెడదారిన పడకుండా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
అవగాహన కార్యక్రమాలతో పాటు నిబంధనల అమలులో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారికి అక్కడికక్కడే ఈ-చలాన్లు విధించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా చట్టాలను గౌరవించాలని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
👇
అన్నమయ్య పోలీస్