సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ ఏసీబీ వలలో.. రూ.9 లక్షల లంచం డిమాండ్ కేసు
హైదరాబాద్లోని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ బతుల మహేందర్పై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. సైబర్ మోసం కేసులో ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను ఇరికించకుండా సహకరిస్తానంటూ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
దర్యాప్తు ప్రకారం, ఇన్స్పెక్టర్ ఇప్పటికే ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన రూ.4 లక్షలు ఇవ్వాలని 30 మే 2026న తన కార్యాలయంలో మరోసారి డిమాండ్ చేసి, బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి నిర్వహించిన సోదాల్లో ఇన్స్పెక్టర్ నివాసం నుంచి లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి మూలాలపై అధికారులు మరింత విచారణ చేపట్టారు.
నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.