సీఎం కప్-2025: రాష్ట్రస్థాయిలో కరీంనగర్ క్రీడాకారుల జైత్రయాత్ర
సీఎం కప్-2025: రాష్ట్రస్థాయిలో కరీంనగర్ క్రీడాకారుల జైత్రయాత్ర.. తృతీయ స్థానం కైవసం!
కరీంనగర్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్-2025 క్రీడా పోటీల్లో కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు తృతీయ స్థానాన్ని సాధించిపెట్టారు. వివిధ క్రీడా విభాగాల్లో పతకాల పంట పండించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి చిత్రా మిశ్రా బుధవారం ప్రత్యేకంగా అభినందించారు.
44 విభాగాల్లో 55 మెడల్స్:
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సాగిన ఈ క్రీడా సంబరంలో కరీంనగర్ జిల్లా క్రీడాకారులు మొత్తం 44 విభాగాల్లో 55 మెడల్స్ సాధించారు. సమర్థవంతమైన క్రీడా నిర్వహణ, క్రీడాకారుల అంకితభావంతో జిల్లాకు మొత్తం 79.4 పాయింట్లు దక్కాయి. దీనితో రాష్ట్రంలోనే మూడవ ఉత్తమ జిల్లాగా కరీంనగర్ నిలిచింది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన విజేతల ఎంపిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా జిల్లా క్రీడాకారులు ఈ కప్ను అందుకున్నారు.
కలెక్టర్ ప్రశంసలు:
విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, కోచ్లు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను తీర్చిదిద్దిన కోచ్లను, ప్రాంతీయ క్రీడా పాఠశాల సిబ్బందిని మరియు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిని ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్, జనార్దన్ రెడ్డి, సభ్యులు రమేష్ రెడ్డి, యోగ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిధారెడ్డి మరియు కోచ్లు పవన్, శ్రీకాంత్, సంపత్, విక్రం, సాయి, ఇందిరా, కిష్టయ్య, రామకృష్ణ, వికాస్, శ్యాం తదితరులు పాల్గొన్నారు.