సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్
సీసీసీలో వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ రాయల్ టాకీస్ వద్ద ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ సొసైటీ (వార సంత వ్యాపారస్తులు) ఆధ్వర్యంలో శ్రీ మైసమ్మ తల్లి బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా జరిగింది. ఈ పవిత్రమైన వేడుకకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, టీపీసీసీ సభ్యులు నూకల రమేష్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మధుకర్ జాతర నిర్వాహకులను అభినందిస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాలకు తెలిసేలా ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డి, అన్నపూర్ణ వారసంత గౌరవ అధ్యక్షులు రాచకొండ వెంకటేశ్వర్ రావు, స్థానిక వ్యాపారస్తులు, అన్నపూర్ణ సొసైటీ సభ్యులు మరియు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు