సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్పై కలెక్టర్తో కాంగ్రెస్ నేతల భేటీ
రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు, రైతులు, పరిసర గ్రామాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
డంపింగ్ యార్డ్ వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, చెత్త నుంచి వెలువడే రసాయనాలు వ్యవసాయ భూముల నాణ్యతను దెబ్బతీసే అవకాశం ఉందని తెలిపారు. దుర్వాసన, హానికర వాయువుల కారణంగా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దోమలు, ఈగలు వంటి కీటకాలు పెరిగి అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, లీచేట్ భూమిలోకి చేరితే బోర్లు, బావులు, చెరువులు వంటి నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. అలాగే భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్, దుమ్ము, శబ్ద కాలుష్య సమస్యలు పెరుగుతాయని తెలిపారు.
ఈ అంశంపై జేఏసీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించిన కలెక్టర్ ప్రజల అభ్యంతరాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు సూచించినట్లు చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తెలిపారు.
సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చౌలపల్లి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఈ అంశాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. అవసరమైతే ప్రజల పక్షాన మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కలెక్టర్ను కలిసిన వారిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్యామ్ సుందర్ రెడ్డి, డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ జేఏసీ చైర్మన్ అంబటి ప్రభాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లారం శేఖర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.