సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్యూ నిరసన
అర్హత లేని వారికి, ఇంటర్వ్యూకు రాని వారికి పోస్టులా? – జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ ఆగ్రహం
శ్రీరాంపూర్లోని సింగరేణి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం అర్హతల ఆధారంగా నియామకాలు చేపట్టకుండా, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని తీవ్రంగా ఆరోపించారు.
ఈ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, కనీసం ముఖాముఖి పరీక్షకు కూడా హాజరుకాని వ్యక్తులను, గతంలో అక్కడ పనిచేసిన వారనే సాకుతో మళ్లీ విధుల్లోకి తీసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసేలా సాగిన ఈ విరుద్ధ నియామకాలపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.