సింగరేణి విశ్రాంత ఉద్యోగుల బ్యాంక్ ప్రమాద బీమాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి
సింగరేణి విశ్రాంత ఉద్యోగుల బ్యాంక్ ప్రమాద బీమాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతి
మంచిర్యాల: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తరహాలోనే యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ. 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చొరవ చూపాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎంపీని కలిసి ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. యూనియన్ బ్యాంకులో ఖాతాలు ఉన్న బొగ్గు గని పెన్షనర్లందరికీ ఈ బీమా సౌకర్యం వర్తింపజేసేలా బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడాలని వారు కోరారు.
ఈ వినతిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తక్షణమే సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై హైదరాబాద్, న్యూఢిల్లీలోని యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో మాట్లాడి, ఎస్బీఐ మాదిరిగానే యూనియన్ బ్యాంకులోనూ విశ్రాంత ఉద్యోగులకు రూ. 50 లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం లభించేలా తప్పకుండా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. తమ సమస్యపై త్వరగా స్పందించిన ఎంపీ వంశీకృష్ణకు విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు