సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు…
సూరంపాలెంలో పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు… గ్రామానికి దారి మూసుకుపోతుందన్న ఆందోళన
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గ్రామంలో పంచాయతీ స్థలం ఆక్రమణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామానికి చెందిన గుడిమళ్ల బ్రహ్మయ్య తన ఇంటి ప్రహరీ నిర్మాణంలో భాగంగా పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి, ఎస్సీ కాలనీకి వెళ్లే సిమెంట్ రోడ్డుకు ఆనించి నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నిర్మాణం కారణంగా సూరంపాలెం ఎస్సీ కాలనీకి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సుమారు 1500 జనాభా గల గ్రామానికి ప్రధాన దారి మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మర్సకట్ల శ్రీనివాసరావు సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక)లో ఎండిఓకి అర్జీ సమర్పించారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీని వెంటనే తొలగించాలని, లేదంటే గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పంచాయతీ స్థలాన్ని కాపాడడంతో పాటు గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.