సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం
సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం: తిరువూరు సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి
తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికల్లో ప్రచారంలో ఉన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారమైనవని సబ్ రిజిస్ట్రార్ చాముండేశ్వరి స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రతి దరఖాస్తును సంబంధిత చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, శాఖ మార్గదర్శకాల ప్రకారమే పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయంలో ఎటువంటి వ్యక్తిగత ప్రభావం, సిఫార్సు లేదా అనధికార జోక్యానికి అవకాశం లేదని పేర్కొన్నారు.
అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయి పారదర్శకతతో విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థపూరిత ఉద్దేశాలు లేదా కక్షసాధింపు ధోరణితో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ వ్యవహారాలను ప్రభావితం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వస్తున్న ప్రచారాలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు.
కార్యాలయ పనితీరుపై ఎవరికైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత ఉన్నతాధికారులకు లేదా చట్టబద్ధమైన వేదికలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమగ్ర విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వాస్తవాలు వెలుగులోకి వస్తే కార్యాలయం పూర్తిగా నిబంధనల ప్రకారమే పనిచేస్తోందన్న విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
అసత్య ఆరోపణలు, పరువు నష్టం కలిగించే ప్రచారాలు, బ్లాక్మెయిల్ ధోరణితో జరిగే చర్యలపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నిరాధార ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని చాముండేశ్వరి విజ్ఞప్తి చేశారు.