నార్కట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన లారీ – ఇద్దరు డ్రైవర్లు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
NTODAY NEWS: నార్కట్పల్లి
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ ఎక్స్రోడ్ ఫ్లైఓవర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ వైపు వెళ్తున్న మోజో ట్రావెల్స్ బస్సు ఒక లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో స్వల్పంగా ఢీకొంది. దీంతో బస్సు డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య వాహనాలను రోడ్డుపక్కన ఆపి కిందకు దిగి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ అదుపుతప్పి నిలిపి ఉంచిన బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య ఉన్న డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు క్లీనర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతకు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి, చిట్యాల ఎస్ఐ రవికుమార్ తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్లీనర్ సురేష్ను చికిత్స కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వెంటనే ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. రహదారులపై వాహనాలు నిలిపేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, అతివేగం వంటి కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. #RoadAccident #Narketpally #Nalgonda #HighwayAccident #RoadSafety #TelanganaNews #NTodayNews