షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ షీ టీం ఎస్సై ఎం.డి. ఘౌస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఈవ్టీజింగ్ మరియు మహిళలపై వేధింపులు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఆన్లైన్లో అపరిచితులతో స్నేహాలు చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు పిలుపునిచ్చారు. నల్గొండ జాగృతి కళాబృందం సభ్యులు పాటలు, నాటికల ద్వారా సైబర్ నేరాలు, బాలల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మండల విద్యాధికారి పానుగోత్ సైదానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.