శివాపురం లో పల్లె నిద్ర కార్యక్రమంతో గ్రామస్తుల్లో భద్రతా చైతన్యం
శివాపురం లో పల్లె నిద్ర కార్యక్రమంతో గ్రామస్తుల్లో భద్రతా చైతన్యం
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శివపురం గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో మార్చి 25/26 రాత్రి ఈ కార్యక్రమం జరిగింది.
గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రజలతో నేరుగా మమేకమై గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణపై కీలక సూచనలు చేశారు.
గ్రామాల్లో చిన్న చిన్న వివాదాలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, తీవ్ర అంశాలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామస్తులందరూ సామరస్యంగా జీవించాలని కోరారు.
రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించిన పోలీసులు, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని, కారులో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ధరించాలని తెలిపారు.
సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోన్లు, ఉద్యోగాల పేరుతో వచ్చే నకిలీ కాల్స్, ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించిన పోలీసులు, వాటి నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా మత్తు పదార్థాల విక్రయం లేదా నిల్వపై సమాచారం ఉంటే 1972 నంబర్కు తెలియజేయాలని సూచించారు. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, అమ్మకాలపై 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు.