శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలయ పవిత్రతను పరిరక్షించే ఈ విశిష్ట కార్యక్రమాన్ని ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం అర్చకులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆనందనిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయంలోని ఉపదేవాలయాలు, ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితర ప్రాంతాలను ప్రత్యేకంగా శుభ్రపరుస్తారని వివరించారు.
తిరుమంజనం సందర్భంగా స్వామివారి మూలవిరాట్టును ప్రత్యేక వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి, ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షించారు. శుద్ధి పూర్తైన అనంతరం స్వామివారి వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమంజనం ముగిసిన తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనాన్ని పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో జేఈవో డాక్టర్ ఏ. శరత్, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో లోకనాథం, టీటీడీ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.