నిషేధిత మాంజా కొనుగోలు-అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు
– ఎస్సై డి. నాగరాజు
NTODAY NEWS : రామన్నపేట
నిషేధిత చైనా మాంజా దారాలను అమ్మిన వారిపై, అలాగే కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్సై డి. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండగను పురస్కరించుకొని తెలుగు సంప్రదాయాల్లో గాలిపటాలు ఎగురవేయడం ఒక ఆనవాయితీగా మారిందని తెలిపారు. అయితే గాలిపటాలు ఎగురవేయడంలో కొంతమంది నిషేధిత చైనా మాంజా, సింథటిక్, నైలాన్తో తయారైన దారాలను ఉపయోగించడం వల్ల పక్షులు, మూగజీవాలు మరియు మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు. చైనా మాంజా తయారీలో గాజు పొడి, ఇతర హానికర రసాయనాలు ఉండటంతో అది అత్యంత పదునుగా, ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు గొంతు కోసుకుపోయే ప్రమాదం ఉండి, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అలాగే పక్షులు ఈ మాంజా దారాల్లో చిక్కుకొని మరణిస్తున్నాయని, ప్లాస్టిక్ మరియు నైలాన్ దారం భూమిలో కరగకపోవడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. గాలిపటాలు ఎగురవేస్తున్న సమయంలో ఈ దారాలు విద్యుత్ లైన్లకు తగిలితే విద్యుత్ షాక్ తగలే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని, నిషేధిత మాంజా దారాలను ఎవరైనా అమ్మినా లేదా కొనుగోలు చేసినా, అటువంటి వారిపై పోలీసు శాఖ పరంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై డి. నాగరాజు స్పష్టం చేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube