అమరవీరుల త్యాగాల పునాదులపైనే తెలంగాణ రాష్ట్రం
NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి వి. శ్రీనివాస్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక ఘట్టమైన మిలియన్ మార్చ్ కు 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ 1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు చేసిన బలిదానాలు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని పేర్కొన్నారు. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ను అడ్డుకోవడానికి అప్పటి ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేసి, ముళ్లకంచెలు ఏర్పాటు చేసి వేలాది మందిని అరెస్టు చేసినప్పటికీ ఉద్యమకారులు వెనుకడుగు వేయలేదన్నారు. ట్యాంక్ బండ్పైకి దూసుకెళ్లి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటారని కొనియాడారు. పోలీసుల లాఠీచార్జీలు, వాటర్ క్యానన్లు, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులు రాష్ట్ర సాధనకు పునాదులు వేసారని తెలిపారు. మలిదశ ఉద్యమంలో అమరులైన 1200 మంది కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ లక్ష్యంతో ఉద్యమకారులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. #MillionMarch #TelanganaMovement #GazelliVenkatayya #GunPark #TelanganaNews #NTodayNews