తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
- చివరి గింజ వరకు కొనుగోలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- వీడియో కాన్ఫరెన్స్లో పౌరసరఫరాల శాఖ మంత్రి సమీక్ష
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని సైతం పూర్తి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ లో తెలంగాణ దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిందని.. ఇప్పటివరకు 8.14 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 10,096 కోట్ల నగదు జమ చేశామని, మిగిలిన 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా యుద్ధప్రాతిపదికన సేకరిస్తామని మంత్రి తెలిపారు.
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాలలో 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యం తడవగా, అందులో 8,833 టన్నులను ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించినట్లు మంత్రి పేర్కొన్నారు. ధాన్యం రవాణాలో లారీల కొరత రాకుండా ఇసుక, సిమెంట్ లారీలను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ముందస్తు చర్యలు చేపట్టి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణపై పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై అధికారులు క్షేత్రస్థాయిలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులను గోదాములుగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నామని, జిల్లాలో ఇప్పటికే 62 శాతం వివరాలను ట్యాబులలో నమోదు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, డీఆర్డీఓ కిషన్, వ్యవసాయ అధికారి సురేఖ తదితరులు పాల్గొన్నారు