తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి
తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనాలి: చాట్ల రాబర్ట్
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో గురువారం కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చాట్ల రాబర్ట్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానికంగా తడిసిన ధాన్యాన్ని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతాంగానికి నష్టం కలిగించిందని ఆరోపించారు. ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి కాటా వేయకపోవడం, ఇప్పటికే కాటా వేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తకపోవడం వల్ల అది తడిసి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కనుక ప్రభుత్వం ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
ఇక ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులు వంద కిలోలకే 4 నుంచి 5 కిలోల తారం అడుగుతున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజాదర్బార్లో తారం అవసరం లేదని చెబుతున్నా, స్థానికంగా అధికారులు మాత్రం తారం కోరుతున్నారని రైతులు చెబుతున్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గుడిసె ప్రభాకర్ రెడ్డి, మైలమాల కాంతారావు, మట్ట కొయ్య రాము, పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, ముప్పిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.