తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులను గుర్తిస్తామని, వారిని గౌరవించి గుండెల్లో దాచుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ ఉద్యమకారుల వేదిక పేర్కొంది. నల్లగొండ జిల్లాలో ‘తెలంగాణ ఉద్యమకారుల వేదిక’ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు అంతటి రవి ముఖ్య అతిథిగా హాజరు కాగా, నల్లగొండ జిల్లా అధ్యక్షులు పల్లపు బుద్ధుడు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారుల గుర్తింపు కోసం వీలైనంత త్వరగా విధివిధానాలు (కమిటీని) రూపొందించాలని కోరారు. రాబోయే పది రోజుల్లోనే ఉద్యమకారులందరికీ ప్రతిఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఉద్యమకారునికి 250 గజాల భూమి, నెలకు ₹25,000 పింఛను, ప్రత్యేక గుర్తింపు కార్డు, ఉచిత బస్సు సౌకర్యం, హెల్త్ కార్డ్ అందించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ప్రభుత్వ కోటాలో ఉద్యమకారులకు, వారి పిల్లలకు స్కూళ్లు, కాలేజీలలో ఉచిత విద్యను కల్పించి గౌరవంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తొలిదశ ఉద్యమకారుల గుర్తింపు: 1969 తొలిదశ ఉద్యమకారుల రికార్డులను జిల్లా కలెక్టర్ల నుంచి వెంటనే తెప్పించుకొని, వారి పేర్లను అధికారికంగా డిక్లేర్ చేయాలి. మలిదశ ఉద్యమకారుల వివరాలు: 2000 సంవత్సరం నుంచి 2013 వరకు జరిగిన మలిదశ ఉద్యమంలో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కేసుల ఆధారంగా ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చి, ఉద్యమకారులను గౌరవప్రదంగా సత్కరించి ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిమాండ్ చేసింది.