తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింపు.. ఉచిత దర్శన టోకెన్ల జారీకి సిద్ధం
ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. అయితే వారాంతాలు, సెలవుల తరువాత సోమవారం భక్తుల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఉదయం 8 గంటల నాటికి ఉచిత సర్వదర్శనం కోసం కేవలం 10 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం సుమారు 8 గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 3–4 గంటలు, రూ.300 శీఘ్రదర్శనానికి 2–3 గంటల సమయం పడుతోంది.
గత రోజు మొత్తం 80,774 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,447 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలు సుమారు రూ.4.05 కోట్లకు చేరినట్లు టీటీడీ పేర్కొంది.
ఇప్పటికే నేటి దర్శన టికెట్లు పూర్తిగా పంపిణీ కాగా, రేపటి ఉచిత దర్శన టోకెన్లను కొద్దిసేపటిలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీవారిమెట్టు వద్ద జారీ చేయనున్నారు.