తిరువూరులో సోమవారం వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
తిరువూరులో సోమవారం వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
తిరువూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు తిరువూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ తిరువూరు పట్టణ అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోస్టుల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, విద్యా వ్యవస్థ, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
డీఎస్సీ నియామకాల విషయంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యా రంగాన్ని, విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తిరువూరు నియోజకవర్గ పరిధిలో డీఎస్సీ నియామకాలపై నిరాశకు గురైన అభ్యర్థులు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతతో పాటు వారి తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని రేగళ్ల మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తిరువూరు ఫ్యాక్టరీ సెంటర్ నుంచి ఉదయం 9 గంటలకు నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ప్రభుత్వంపై తమ నిరసనను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.