తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ
తక్కెళ్ళపహాడ్లో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం
తక్కెళ్ళపహాడ్ | NTODAY NEWS
తక్కెళ్ళపహాడ్ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన గంటలోపు తొలి ఆహారంగా ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఆరోగ్యవంతమైన జీవితానికి బలమైన పునాది వేస్తాయని తెలిపారు.
అనంతరం ICDS సూపర్వైజర్ సునీత మాట్లాడుతూ, శిశువుకు తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, ఆ తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారాన్ని ప్రారంభించాలని సూచించారు. బిడ్డకు రెండు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు తల్లిపాలను కొనసాగించడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదలతో పాటు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టంగురి సురేందర్ రెడ్డి, ICDS సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.