తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం: తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు
తిరువూరు: తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నారు. శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలను మాత్రమే అందించాలని, అనంతరం అదనపు పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడంలో అంగన్వాడీ సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు.
గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడన్నారు.
కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు. తిరువూరు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్, ఏపీఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.