తప్పుడు అత్యాచార కేసు.. యువకుడికి 4 ఏళ్ల జైలు శిక్ష.....
తప్పుడు అత్యాచార కేసు.. యువకుడికి 4 ఏళ్ల జైలు శిక్ష.. చివరకు నిజం బయటపడడంతో యువతికి షాక్
రాయ్బరేలీ: నిజానిజాలు తెలుసుకోకుండా నమోదయ్యే తప్పుడు కేసులు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లాలో ఓ యువకుడు తాను చేయని నేరానికి నాలుగున్నరేళ్లకు పైగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగాలు మోపారు. విచారణలో యువకుడికి శిక్ష పడటంతో అతను 4 సంవత్సరాల 6 నెలలకు పైగా జైలులో ఉన్నాడు.
అయితే ఈ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. కొంతకాలం తర్వాత అదే యువతి కోర్టును ఆశ్రయించి తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, తానే తప్పుడు కేసు పెట్టానని అంగీకరించింది. ఆమె వాంగ్మూలాన్ని పరిశీలించిన న్యాయస్థానం యువకుడిని విడుదల చేసింది.
అయితే తప్పుడు ఫిర్యాదు చేసి, తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు యువతిపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బాధిత యువకుడు ఎంతకాలం జైలులో ఉన్నాడో అంతకాలం అంటే 1,653 రోజుల జైలు శిక్షను విధించింది. దీంతో పాటు రూ.5,88,822 జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
తప్పుడు ఆరోపణలతో నిరపరాధుల జీవితాలను నాశనం చేయకూడదని, చట్టాన్ని దుర్వినియోగం చేసే వారికి ఈ తీర్పు గుణపాఠమని పలువురు అభిప్రాయపడుతున్నారు.