తుమ్మగూడెంలో మార్మోగిన పాపన్న గౌడ్ నినాదాలు.. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక పాపన్న గౌడ్ బూబత్తుల చెన్నారావు
అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహాయోధుడు పాపన్న గౌడ్: బూబత్తుల చెన్నారావు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో భారతదేశ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు గౌడ సంఘ నేతల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చాట్రాయి మండల గౌడ సంఘం అధ్యక్షులు బూబత్తుల చెన్నారావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు తలెత్తుకుని జీవించాలనే లక్ష్యంతో పోరాడిన గొప్ప యోధుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. అధికారం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైన సమయంలో అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి హక్కుల కోసం కత్తి పట్టిన ధైర్యవంతుడని అన్నారు. ప్రజలపై సాగిన దోపిడీలు, అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల్లో చైతన్యం నింపిన మహానాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో బహుజనుల ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూజివీడు నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు తల్లాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై స్వతంత్ర జ్యోతిని వెలిగించిన మహావీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అని అన్నారు. భారతదేశ చరిత్రలో ఆయన పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. రాష్ట్ర గౌడ సంఘ నాయకులు కృష్ణారావు, పాలెం ఎంపీటీసీ చింతగుంట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజరిక వ్యవస్థలో జమీందార్ల అరాచకాలకు వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి భువనగిరి, వరంగల్, గోల్కొండ కోటలను జయించిన వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. బహుజన చక్రవర్తిగా ఆయన సాధించిన విజయాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్వతాపురం టీడీపీ మాజీ అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు, తుమ్మగూడెం గౌడ సంఘ సభ్యులు పానుగంటి శ్రీమన్నారాయణ, అనిల్, సత్యనారాయణ, రాము, అప్పారావు, శ్రీనివాసరావు, మిద్దె చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.