www.ntodaynews.com
పేదల కళ్లలో సంక్రాంతి వెలుగులు
తెలంగాణ
పేదల కళ్లలో సంక్రాంతి వెలుగులు
సంక్రాంతి కానుకగా పేదలకు ఇళ్ల పట్టాలు – నెరవేరిన నాలుగు దశాబ్దాల కల NTODAY NEWS: విజయవాడ, నందమూరి నగర్, సింగినగర్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ నందమూరి నగర్ సెంటర్లో, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల సొంత ఇంటి కలకు నేడు నెరవేరింది. సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి నగర్ వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం బహిరంగ వేదికపై నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బొండా ఉమామహేశ్వరరావు, లక్ష్మీ షా, చైతన్య, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు
ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, వేదికపైకి వస్తున్న సమయంలో మహిళల కళ్లలో కనిపించిన ఆనందం, తడిబారిన కళ్లతో లబ్ధిదారులు వ్యక్తం చేసిన భావోద్వేగాలు తనను కదిలించాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా నెరవేరని కల నేడు కూటమి ప్రభుత్వ హయాంలో నిజమైందన్నారు.
విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లోని పేదలు దశాబ్దాలుగా చట్టబద్ధతలేని స్థలాల్లో నివాసం ఉంటున్నారని, వారందరికీ చట్టబద్ధత కల్పిస్తూ జీఓ నంబర్ 30 నిబంధనల ప్రకారం ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. సర్వే నంబర్లు 24/100, 27/1బి పరిధిలో 36.39 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 70 మందికి పట్టాలు పంపిణీ చేయగా, ఈ దశలో 51 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ఎన్నికల హామీ అమలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నేడు మాట నిలబెట్టుకున్నామని, ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. నందమూరి నగర్ ప్రజలు ఇకపై ధైర్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చని, ఈ పట్టాల ద్వారా నగరపాలక సంస్థల అనుమతులు, బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రజల అవసరాలకు తక్షణ స్పందన కోసం ఈ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
కలెక్టర్ వ్యాఖ్యలు
జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న 70 కుటుంబాల అక్రమణలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వేగంగా అమలు చేసి, సంక్రాంతి కానుకగా 51 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశామని తెలిపారు. ఇది పేదల ఆర్థిక అభివృద్ధికి దోహదపడే కార్యక్రమమని, ప్రభుత్వం అణగారిన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఇకపై లబ్ధిదారులు ధైర్యంగా శాశ్వత నివాసాలు నిర్మించుకోవచ్చని సూచించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఆర్డీవో చైతన్య, నార్త్ ఎమ్మార్వో సూర్యారావు, నవనీతం సాంబశివరావు, పిరియా సోమేశ్వరరావు, ఎ. రుబోతు రామారావు, ఎరువుతూ రమణ, తారక రామారావు, మాజీ కార్పొరేటర్లు ఎరుబోతు శ్రావణి, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.
#SankrantiGift
#HousePatta
#HousingForPoor
#Vijayawada
#SocialWelfare
#CoalitionGovernment
#PeopleFirst
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube 