www.ntodaynews.com
యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
తెలంగాణ
నాణ్యమైన ఆహారం కోసం యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన
వండిన అన్నంతో రాష్ట్ర రహదారిపై బైఠాయించిన విద్యార్థులు
NTODAY NEWS: నార్కట్పల్లి
నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం అందించిన జీరా రైస్లో గుట్కా ప్యాకెట్ లభించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నార్కట్పల్లి–అద్దంకి రాష్ట్ర రహదారిపై వండిన అన్నంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు కొనసాగిన నిరసనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా అన్నంలో క్రిమికీటకాలు బయటపడిన సంఘటనలు ఉన్నప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యం కంటే హాజరు శాతానికే ప్రాధాన్యం ఇస్తూ పునరావృతమవుతున్న సమస్యలపై స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.
ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన ఆహారం అందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైస్ ఛాన్సలర్ను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు చత్రపతి చౌహన్, హనుమాన్, మౌనిష్ సూర్య, మోహన్, సుధీర్, అజయ్, సతీష్, విజయ్, శంకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
#UniversityStudents
#QualityFood
#StudentProtest
#FoodSafety
#ABVP
#MahathmaGandhiUniversity
#Nalgonda
#StudentIssues
#CampusNews
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube