ఉపాధి కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం
విస్సన్నపేట, జూన్ 5: ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు విస్సన్నపేట మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు.
విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ శివారులోని నర్మదానగర్ ఉపాధి పనుల ప్రాంతాన్ని వారు సందర్శించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి కూలీల హాజరు నమోదుకు అమలు చేస్తున్న రెండు ఫోటోల ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. విస్సంపల్లి నాగరాజు మాట్లాడుతూ గత ఐదు వారాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధి కూలీల వేతన బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని కూలీలకు ప్రత్యేకంగా ఈ-కేవైసీ నిర్వహించాలని, పాత బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి పనుల ప్రాంతాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, కూలీలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.