వామ్మో మట్టి టిప్పర్లు
వామ్మో మట్టి టిప్పర్లు NTODAY NEWS చిట్యాల
పెద్ద కాపర్తి మట్టి టిప్పర్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న గ్రామస్థులు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో మట్టి రవాణా చలవిడిగా సాగుతోంది. గత వారం రోజులుగా పెద్ద కాపర్తి రోడ్లపై టిప్పర్ల మోత మోగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించిందో లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కాక గ్రామస్థులు వాపోతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారిపై నుండి భారీ ఎత్తున నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు అని, పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా ఈ రవాణా సాగుతోంది అని. అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే, నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్న వీధుల్లో ఈ భారీ వాహనాలు తిరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
* గ్రామమా ? జాతీయ రహదారా?
టిప్పర్ల రాకపోకలతో పెద్దకాపర్తి గ్రామం కాస్తా జాతీయ రహదారిని తలపిస్తోంది. టిప్పర్లు గ్రామ వీధుల్లో విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుండటంతో దుమ్ము ధూళి రేగి ఇళ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చిన్నారులు, వృద్ధులు రోడ్డు మీదకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
* ధ్వని కాలుష్యం:
అర్ధరాత్రి వేళల్లో కూడా టిప్పర్ల శబ్దాలతో గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అని వాపోతున్నారు.. మేము గ్రామంలో ఉంటున్నామో లేక హైవే పక్కన ఉంటున్నామో అర్థం కావడం లేదు. పిల్లల్ని బయటకు పంపాలంటే భయమేస్తోంది అని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ తమ గ్రామం నుండి మట్టి రవాణాను అరికట్టాలి అని వేడుకుంటున్నారు.
అధికారులు స్పందించేనా?
మట్టిని తరలిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దకాపర్తి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు పోలీస్ యంత్రాంగం తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, పెద్ద కాపర్తి గ్రామం నుండి ఈ 'మట్టి' దందాను అరికట్టాలని కోరుతున్నారు.