వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకు గుడ్న్యూస్.. నెరవేరిన చిరకాల కోరిక!
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో అత్యాధునిక సౌకర్యాలతో నూతన డిస్పెన్సరీని ప్రారంభించింది. ఇకపై క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యసేవలు అందనున్నాయి.
ఈ డిస్పెన్సరీలో ఈసీజీ యంత్రాలు, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్స్, అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు నలుగురు వైద్యులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహించనుండగా, అవసరమైతే అశ్విని ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచారు.
క్యూ లైన్లలో వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ కేంద్రం ప్రాణరక్షణగా మారనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడికక్కడే చికిత్స అందించగలగడం ఈ కేంద్రం ప్రత్యేకత.
భక్తుల సౌకర్యం, భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ చేపట్టిన ఈ చర్యపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్ర అందుబాటులోకి రానుంది.