విద్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనే లక్ష్యం: కలెక్టర్ కుమార్ దీపక్
విద్యాభివృద్ధితో పాటు ఉపాధి కల్పనే లక్ష్యం: కలెక్టర్ కుమార్ దీపక్
విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో వెల్లడి
విద్యావ్యవస్థలో ప్రణాళికబద్ధమైన మార్పుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు, వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి అంజయ్యతో కలిసి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు మరియు అధునాతన సాంకేతిక కేంద్రాల ప్రధానాచార్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అవసరమైన అధ్యాపకులు, సిబ్బంది నియామకాలతో పాటు నిర్ణీత గడువులోగా పాఠ్యాంశాలను పూర్తి చేసి ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అధునాతన సాంకేతిక కేంద్రాల ద్వారా సరికొత్త సాంకేతిక కోర్సులలో వృత్తివిద్య శిక్షణ అందిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటికే ఉద్యోగాలు సాధించిన వారి వివరాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ, నూతన కోర్సులపై అవగాహన కల్పించి కొత్త చేరికల సంఖ్యను పెంచాలని సూచించారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థులు కనీసం 90 శాతం హాజరు సాధించేలా చూడాలన్నారు. అధ్యాపకులు నెలవారీ పాఠ్యాంశాల నమోదు పుస్తకాలను నిర్వహించాలని, అధ్యాయాల వారీగా స్లిప్ టెస్టులు పెట్టాలని, హాజరు తక్కువగా ఉన్న విద్యార్థుల వివరాలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, ప్రధానాచార్యులు తదితరులు పాల్గొన్నారు