విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించం: వీర్లపల్లి శంకర్
హైదరాబాద్, జూలై 22: ఢిల్లీలో నీట్ పరీక్ష వివాదం, విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు నిర్వహించిన ధర్నాలో షాద్నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కష్టపడి పరీక్షలు రాస్తున్నారని, అలాంటి పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు.
తమ న్యాయమైన సమస్యలపై ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ ధర్నాలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.