విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- నస్పూర్లో కేజీబీవీ, తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సీఐ రవీందర్తో కలిసి సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం, భోజనశాల, వంటశాల పనులతో పాటు భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం, శుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంటర్ బైపీసీ విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు విధుల్లో సమయపాలన పాటించాలని, వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి, తహసీల్దార్ సంతోష్ కుమార్తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ప్రజల నుంచి సేకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా స్పష్టంగా వివరాలు నమోదు చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఈ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే, కార్యాలయంలో భూభారతి, సాదా బైనామా, రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కార తీరును పరిశీలించి సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు