అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గర్జించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్
విజయవాడ ధర్నా చౌక్లో అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గర్జించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్
విజయవాడ ధర్నా చౌక్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా యుద్ధోన్మాద వ్యతిరేక బహిరంగ సభ రాజకీయ వేడి రాజేసింది. ఈ సభలో ప్రముఖ నాయకుడు డి. హరినాథ్ తీవ్రంగా స్పందిస్తూ “యుద్ధం వద్దు… ప్రపంచ శాంతి కావాలి” అని పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేసిన ఆయన, అమెరికాలోనే దాదాపు 90 లక్షల మంది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని యుద్ధాల వైపు నెట్టే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా ప్రభావానికి లోనయ్యేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను హరినాథ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను లక్ష్యంగా చేసుకుని, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సభకు ఉదయ్ కిరణ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రావు, ఆర్. నాగమణి, టి. అరుణ, డి. పుల్లారావు, వేమన వెంకటేశ్వర్లు, ఓబయ్య, బక్కయ్య, పూజిత, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సభలో నాయకులు సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిస్తూ, శాంతి కోసం ప్రజలు ఐక్యంగా నిలవాలని కోరారు.