వికలాంగురాలి ఆవేదనకు న్యాయం చేయాలని అధికారులకు వినతి
వికలాంగురాలి ఆవేదనకు న్యాయం చేయాలని అధికారులకు వినతి
ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:
విస్సన్నపేట మండల ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో సోమవారం ఓ వికలాంగురాలు తన గోడును అధికారుల ముందుంచింది. మండలంలోని కొర్లమండ గ్రామ శివారు నాయకులగూడెంకు చెందిన జువ్వనబోయిన పుష్పవతి, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా మట్టికట్ట వేయడంతో ప్రతి వర్షానికీ తన ఇంటిలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అర్జీలో పేర్కొంది.
తనకు ఐదు సెంట్ల నివేశన స్థలంలో రేకుల షెడ్డు మాత్రమే ఉందని, తాను వికలాంగురాలినని, వివాహం కాలేదని, ఒంటరిగా జీవిస్తున్నానని తెలిపింది. గ్రామంలో కొందరు తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, దారికి అడ్డంగా మట్టికట్ట వేయడంతో చిన్న వర్షం పడినా ఇంట్లోకి నీరు చేరి జీవనం దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయాన్ని ప్రశ్నించినప్పటి నుంచి మరింతగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, వెంటనే ఆ మట్టికట్టను తొలగించి తనకు న్యాయం చేయాలని, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా న్యాయవాది సిరసాని ప్రకాష్ మాట్లాడుతూ, వికలాంగురాలి పరిస్థితిని సామాజిక బాధ్యతగా పరిగణించి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని మండల రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామంలో పరిస్థితిని పరిశీలించి, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టికట్టను తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.