విస్సన్నపేటలో డ్వాక్రా గ్రూపుల భారీ మోసం వెలుగులోకి
విస్సన్నపేటలో డ్వాక్రా గ్రూపుల భారీ మోసం వెలుగులోకి
ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం విస్సన్నపేటలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న ఇండియన్ బ్యాంక్ ఎదుట డ్వాక్రా సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు. ముచ్చనపల్లి గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపుల బుక్ కీపర్ మౌనిక సుమారు రూ.30 లక్షలకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
సభ్యులకు తెలియకుండా వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వివిధ గ్రూపుల ఖాతాల నుంచి డబ్బులను మళ్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బ్యాంక్ మేనేజర్ ముందుగానే అనుమానం వ్యక్తం చేసి, మౌనికను పిలిచి విచారించగా, తాను చేసిన తప్పును అంగీకరించినట్లు గ్రామ పెద్దల సమక్షంలో వెల్లడించారు.
ఇంక్వయిరీలో బయటపడుతున్న వివరాల ప్రకారం, కొంతమంది ప్రెసిడెంట్లు, సెక్రటరీలతో కుమ్మక్కై ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రూపులకు కొంత మొత్తాన్ని తిరిగి పంపించి, మిగతా నిధులను తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2020 నుండి ఇప్పటి వరకు సుమారు 40కి పైగా గ్రూపుల మినిట్స్ పుస్తకాలు కూడా మౌనిక వద్దే ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తీర్మానాల్లో అసమంజసం, రికార్డుల లోపం కూడా వెలుగులోకి వచ్చింది.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి, ఈ స్కాంలో భాగమైన వారందరినీ గుర్తించి అరెస్టు చేయాలని డ్వాక్రా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు తమ లోన్ల చెల్లింపులను నిలిపివేస్తామని బ్యాంక్ మేనేజర్కు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వెలుగు అధికారులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
అధికారులు త్వరగా స్పందించకపోతే తీవ్ర నిరసనలు చేపడతామని గ్రామ పెద్ద హరినాథ్ హెచ్చరించారు. ఈ అంశంపై వెంకటేశ్వరమ్మ, సీత, రత్నం, దుర్గ, రహీం తుల్లా, బాబుల్ సాహెబ్ తదితరులు బ్యాంక్ మేనేజర్ను కలిసి వివరాలు వెల్లడించారు.