విస్సన్నపేటలో హమాలీల ఆగ్రహం.. కూలి బకాయిలపై సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా!
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం స్థానిక విస్సన్నపేట లో
నెలల తరబడి కష్టపడి పనిచేసినా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ సివిల్ సప్లై హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు విస్సన్నపేట సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ధర్నాలో కార్మికులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ, "రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీలకు చేసిన పనికి నెలలు గడిచినా కూలి చెల్లించకపోవడం దారుణం. మే నెలలో చేసిన పనికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు కుటుంబాలను ఎలా పోషించాలి?" అని ప్రశ్నించారు.
అలాగే విస్సన్నపేట మండలంలోని మూడు రేషన్ షాపుల ఎగుమతి, దిగుమతి పనులను స్థానిక హమాలీలకు కాకుండా తిరువూరు పాయింట్ కార్మికులతో చేయించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ పనులను విస్సన్నపేట హమాలీ కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న కూలి బకాయిలు, ఉపాధి సమస్యలు, ఇతర పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ధర్నాకు ఏఐటీయూసీ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దంతాల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.